అగస్టా కేసులో తొలి వికెట్‌

10 Dec, 2016 02:49 IST|Sakshi
ఎస్పీ త్యాగి (ఫైల్‌)

వాయుసేన మాజీ చీఫ్‌ ఎస్‌పీ త్యాగి అరెస్టు
► విచారణకు పిలిచి అరెస్టు చేసిన సీబీఐ
న్యూఢిల్లీ: యూపీఏ–2 హయాంలో సంచలనం రేపిన అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో అరెస్టుల పర్వం మొదలైంది. 12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి రూ.450 కోట్ల ముడుపులు తీసుకున్న కేసులో 2013లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాగా.. శుక్రవారం ఎయిర్‌ ఫోర్సు మాజీ చీఫ్‌ ఎస్పీ త్యాగితోపాటు అతని సోదరుడు సంజయ్, లాయర్‌ గౌతమ్‌ ఖైతాన్ ను సీబీఐ అరెస్టు చేసింది. శుక్రవారం వీరిని విచారణకు పిలిచిన అధికారులు.. నాలుగు గంటల విచారణ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇదే తొలి అరెస్టు. ‘ఈ కుంభకోణానికి సంబంధించిన వ్యక్తులతో కలిసి 2005లో అప్పటి వైమానిక దళ అధికారులు కుట్రపూరితంగా వ్యవహరించారని ఆరోపణలొచ్చాయి. దీనిపై విచారణ సందర్భంగా పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి.

అరెస్టు చేసిన వారందరినీ.. శనివారం కోర్టులో ప్రవేశపెడతాం. తర్వాత రిమాండ్‌ కోరతాం’ అని సీబీఐ అధికార ప్రతినిధి దెవ్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. కాగా, ఇటలీ మధ్యవర్తి గుయిడో హ్యాష్‌కే, కార్లో గెరోసా నుంచి ముడుపులు తీసుకున్నట్లు అంగీకరించిన ఖైతా¯ŒS.. ఈ ముడుపులు డీల్‌ను ప్రభావితం చేసేందుకు మాత్రం కాదని వెల్లడించినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. వీవీఐపీ హెలికాప్టర్లు ఎగరాల్సిన ఎత్తును 6వేల అడుగుల నుంచి తగ్గించేలా నిబంధనలు మార్చేలా  2005లో త్యాగి అంగీకరిచినట్లు తెలిపాయి. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు రూ. 450 కోట్ల ముడుపులు తీసుకుని త్యాగి నిబంధనలు మార్చేలా అధికారులను ప్రభావితం చేశారని సీబీఐ పేర్కొంది.

కాగా, ఈ కేసుకు సంబంధించి త్యాగితోపాటు మరో 18 మందిపై (అతని సోదరులు, యురోపియ¯ŒS మధ్యవర్తులు, కంపెనీలు) సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణకు సహకరించేందుకు పలు దేశాలకు రొగేటరీ లెటర్ల (న్యాయపరమైన అభ్యర్థనలు)ను జారీ చేసింది. వీవీఐపీ హెలికాప్టర్ల ఒప్పందంపై ఆరోపణలు రావటంతో 2014 జనవరిలో అప్పటి ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దుచేసింది.