సీబీఐ చీఫ్‌గా శుక్లా బాధ్యతల స్వీకరణ

5 Feb, 2019 04:34 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కొత్త డైరెక్టర్‌గా నియమితులైన రిషి కుమార్‌ శుక్లా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సీబీఐ 28వ డైరెక్టర్‌గా రిషి శనివారం నియమితులైన విషయం తెలిసిందే. 1983 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన 58 ఏళ్ల రిషి కుమార్‌ మధ్యప్రదేశ్‌ డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. సాధారణంగా కొత్తగా నియమితులైన వారెవరైనా కనీసం వారం రోజుల తర్వాత బాధ్యతలు స్వీకరిస్తారు. ఆదివారం కోల్‌కతాలో బెంగాల్‌ పోలీసులకు, సీబీఐ అధికారులకు మధ్య జరిగిన ఘర్షణ కాస్తా.. కేంద్రం, బెంగాల్‌ ప్రభుత్వానికి మధ్య రాజకీయ యుద్ధం కారణంగానే రెండ్రోజులకే బాధ్యతలు స్వీకరించినట్లు తెలుస్తోంది. సీబీఐ ఉన్నతాధికారులు అలోక్‌ వర్మ, రాకేశ్‌ ఆస్తానాలు పరస్పరం అవినీతి ఆరోపణల నేపథ్యంలో వీరిద్దరినీ కేంద్రం సెలవుపై పంపి, నాగేశ్వర్‌రావును తాత్కాలిక చీఫ్‌గా నియమించింది. తాజాగా ప్రధాని నేతృత్వంలోని కమిటీ సీబీఐ డైరెక్టర్‌గా శుక్లాను నియమించింది.

>
మరిన్ని వార్తలు