అక్రమాస్తుల కేసు : ములాయం, అఖిలేష్‌లకు క్లీన్‌చిట్‌

21 May, 2019 12:12 IST|Sakshi

లక్నో : అక్రమాస్తుల కేసులో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్‌ యాదవ్‌కు, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌కు ఊరట లభించింది. గురువారం ఈ కేసులో సీబీఐ తండ్రికొడుకులిద్దరికి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. అంతేకాక అఖిలేష్‌, ములాయంల మీద రెగ్యూలర్‌ కేసు నమోదు చేసేందుకు తమ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని సీబీఐ, సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. ములాయం సింగ్‌ అధికారంలో ఉన్న రోజుల్లో వారి ఆస్తులు అనూహ్యంగా పెరగాయంటూ గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

దీని మీద విచారణ చేపట్టాలంటూ విశ్వనాథ్‌ చతుర్వేదీ అనే వ్యక్తి 2005లో సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 2007 మార్చి 1న ములాయం, ఆయన కుమారులు అఖిలేశ్ యాదవ్‌, ప్రతీక్‌ యాదవ్‌, కోడలు డింపుల్‌ యాదవ్‌లపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఆ తర్వాత 2012లో కోర్టు ఈ కేసు నుంచి డింపుల్‌ యాదవ్‌కు మినహాయింపు కల్పించింది. అయితే ఈ కేసులో సీబీఐ ఇంత వరకూ ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయకపోవటంతో విశ్వనాథ్‌ మరోసారి సుప్రీ కోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై ఈ ఏడాది మార్చిలో మరోసారి విచారణ చేపట్టిన కోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ములాయం, అఖిలేష్‌ల కేసు దర్యాప్తు ఎంత వరకూ వచ్చిందో తెలుపుతూ.. రెండు వారాల్లోగా తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దాంతో సీబీఐ నేడు చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.

మరిన్ని వార్తలు