దేశవ్యాప్తంగా 110 ప్రాంతాల్లో సీబీఐ దాడులు

10 Jul, 2019 04:27 IST|Sakshi

న్యూఢిల్లీ: సీబీఐ అధికారులు మంగళవారం రికార్డు స్థాయిలో సోదాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్‌సహా దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 110 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలను ప్రధాని మోదీ హయాంలో అవినీతిపై చేపట్టిన అతిపెద్ద చర్యగా భావిస్తున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో చోటుచేసుకున్న రూ.250 కోట్ల స్కాలర్‌ షిప్‌ కుంభకోణానికి సంబంధించి పలు విద్యా సంస్థలపై దాడులు జరిపింది. అదేవిధంగా, యూపీలో రద్దయిన నోట్ల చెలామణీ ఆరోపణలపై నాలుగుచోట్ల సోదాలు జరిపింది.

రూర్కెలాలోని బోకారో స్టీల్‌ ప్లాంట్‌లో అవినీతి కేసులో రాంచీ, బొకారో, కోల్‌కతాలోని అధికారుల ఇళ్లపై దాడులు చేసింది. ఈ సందర్భంగా సీబీఐ.. అవినీతి, నేర పూరిత ప్రవర్తన, ఆయుధాల స్మగ్లింగ్‌ తదితర నేరాలకు సంబంధించి 30 కేసులు నమోదు చేసింది. జమ్మూకశ్మీర్‌లో ఆయుధాల లైసెన్స్‌ జారీలో అక్రమాలకు సంబంధించి 13 చోట్ల సోదాలు చేశామని సీబీఐ తెలిపింది. మంగళవారం ఉదయం ఏకకాలంలో ప్రారంభమైన ఈ సోదాల్లో 500 మంది అధికారులు పాల్గొన్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా నగదు, నగలతోపాటు పలు బ్యాంకు పత్రాలు, స్థిరాస్తులు, మ్యూచువల్‌ ఫండ్స్‌ పత్రాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించింది. రూ.1,139 కోట్ల బ్యాంకింగ్‌ కుంభకోణానికి సంబంధించి సీబీఐ గత వారం 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 50 చోట్ల తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు