న్యూఢిల్లీ: సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) ప్రాథమిక నివేదికలోని అంశాలపై సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ సోమవారం సుప్రీంకోర్టుకు సమాధానమిచ్చారు. దీనిపై నేడు కోర్టు విచారణ చేపట్టనుంది. కోర్టు ఆదేశాల మేరకు అలోక్ వర్మ మధ్యాహ్నం ఒంటిగంటకు సీల్డు కవర్లో సమాధానం అందజేశారు. అంతకుముందు ఆయన.. సమాధానం ఇచ్చేందుకు మరికాస్త సమయం కావాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ ద్వారా కోరగా న్యాయస్థానం తిరస్కరించింది. ‘విచారణ తేదీని మేం మార్చట్లేదు. సాధ్యమైనంత తొందరగా మీరు సమాధానమిస్తే, రేపు చేపట్టే విచారణ కోసం దానిని చదవాల్సింది ఉంటుంది’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం వర్మ లాయర్కు తెలిపింది. దీంతో వర్మ..సరిగ్గా ఒంటి గంట సమయానికి తనపై ఆరోపణలకు సంబంధించి వివరణలున్న సీల్డు కవర్ను కోర్టుకు అందజేశారు.