గుజరాత్ లో జరిగిన ఇష్రాత్ జహాన్ ఎన్కౌంటర్ బూటకపుదని సీబీఐ తేల్చింది. ఈ కేసులో సీబీఐ నేడు చార్జిషీటు దాఖలు చేసింది. 2004 జరిగిన ఈ ఎన్కౌంటర్ గుజరాత్ లో అత్యంత వివాదస్సదంగా మారింది. గుజరాత్ పోలీసులు, సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్ఐబీ) సంయుక్తంగా ఈ ఎన్కౌంటర్ లో పాల్గొన్నాయని చార్జిషీటులో సీబీఐ పేర్కొంది.
గుజరాత్ ఏడీజీపీ పీపీ పాండే, సస్పెండ్ పోలీసు అధికారులు డీజీ వంజర, జిఎల్ సింఘాల్, తరుణ్ బారోట్, ఎన్ కే ఆమిన్, అనజు చౌదరీలపై మూడు అభియోగాలు మోపింది. ఇంటెలిజెన్స్ బ్యూరో రాజిందర్ కుమార్ మరో నలుగురు ఇంటెలిజెన్స్ అధికారులపై దర్యాప్తు కొనసాగుతోందని కోర్టుకు సీబీఐ తెలిపింది.
ముంబైకి చెందిన19 ఏళ్ల విద్యార్థిని ఇష్రాత్ జహాన్ 2004, జూన్ 15న గుజరాత్ లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందింది. ఆమెతో పాటు జావెద్ షేక్, అంజాద్ అలీ, అక్బరాలి రానా, జీషన్ జోహార్ లను కూడా ఎన్కౌంటర్లో కాల్చిచంపారు.