‘స్కూల్‌-ఇల్లు విద్యాభ్యాసంనకు మళ్లండి’

5 Apr, 2020 14:42 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో విద్యార్థులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వైరస్‌ భయాలతో తల్లిదండ్రులు పిల్లల్ని కంటికి రెప్పలా కాచుకుని ఉంటున్నారు. అయితే, విద్య అంటే కేవలం తరగతి గదుల్లోనే అనే ఆలోచనల నుంచి బయటపడాలని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) చైర్మన్‌ అనిత కార్వాల్‌ అన్నారు. ‘స్కూళ్లోనే విద్యాభ్యాసం’ విధానం నుంచి ‘స్కూల్‌- ఇల్లు సహకారంతో విద్యాభ్యాసం’ వైపునకు మళ్లాల్సిన సమయం వచ్చిందని ఆమె దేశవ్యాప్తంగా పాఠశాల ప్రిన్సిపాళ్లకు రాసిన లేఖలో పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ కాలాన్ని ఒక చాలెంజ్‌గా తీసుకుని.. ఫ్యామిలీతో ఉంటూనే విద్యార్థులు జీవితానికి అవసరమైన పాఠాలు నేర్చుకునే దిశగా కొత్త మార్గాలు అన్వేషించాలని ఆమె పేర్కొన్నారు.

మానవ సంబంధాలు, ప్రకృతి గొప్పదనం గురించి పిల్లలకు చెప్పాలని అన్నారు. అకడెమిక్‌ లక్ష్యాలైన పాఠ్యాంశాల బోధన, ఆన్‌లైన్‌ క్లాసులతోపాటు సంస్కృతి, వాతావరణ మార్పులపై బోధించాలని స్కూల్‌ ప్రిన్సిపాళ్లకు సూచించారు. స్వీయ అభ్యాసం, పరిశోధన అలవాట్లు పెంపొందిచాలని అన్నారు. ముఖ్యంగా 5 నుంచి 12వ తరగతి విద్యార్థులపై ఫోకస్‌ పెట్టాలని చెప్పారు. ఇక పిల్లలకు కుటుంబ సభ్యులు ప్రస్తుత విపత్కర పరిస్థితులతోపాటు.. భవిష్యత్‌లో ఎదుర్కోబోయే సవాళ్లపై అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రతి ఇంటిలో కిచెన్‌ ఒక ల్యాబ్‌ వంటిదని,  తల్లిదండ్రులు పిల్లలను వంట తయారు చేయడంలో భాగం చేయాలని అన్నారు.

>
మరిన్ని వార్తలు