30% తగ్గనున్న సీబీఎస్‌ఈ సిలబస్‌

8 Jul, 2020 01:17 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 కారణంగా సకాలంలో స్కూళ్లు తెరుచుకోకపోవడంతో నష్టపోయిన విద్యా సంవత్సరాన్ని భర్తీ చేసేందుకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. 2020–21 విద్యా సంవత్సరంలో 9 నుంచి12వ తరగతి వరకు సిలబస్‌ను 30 శాతం మేర తగ్గించింది. ‘దేశంలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల దృష్ట్యా 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులపై భారం తగ్గించి, కరిక్యులమ్‌ రివైజ్‌ చేయాలని సీబీఎస్‌ఈని కోరాం’అని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పొఖ్రియాల్‌ తెలిపారు.

దీనిపై గత వారం సూచనలు కోరగా విద్యావేత్తలు పెద్ద సంఖ్యలో స్పందించారన్నారు. వీరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, 30 శాతం మేర సిలబస్‌ను హేతుబద్ధీకరించినట్లు తెలిపారు. ఈమేరకు మార్పులను సీబీఎస్‌ఈ పరిపాలక మండలి కూడా ఆమోదించిందన్నారు. తగ్గించిన సిలబస్‌ పాఠ్యాంశాలను కూడా విద్యార్థులకు బోధించాల్సి ఉంటుందని పాఠశాలలకు, ఉపాధ్యాయులకు సూచించామన్నారు. అయితే, ఇంటర్నల్స్, వార్షిక పరీక్షల్లో తగ్గించిన సిలబస్‌లోని అంశాలపై ప్రశ్నలుండవని వివరించారు. 1 నుంచి 8వ తరగతి విద్యార్థుల కోసం ఎన్‌సీఈఆర్‌టీ ఇప్పటికే ప్రత్యామ్నాయ కేలండర్‌ను రూపొందించి, ప్రకటించిందన్నారు.

మరిన్ని వార్తలు