కంప్యూటర్‌తో పరీక్షలు

1 Mar, 2018 02:15 IST|Sakshi

దివ్యాంగ విద్యార్థులకు సీబీఎస్‌ఈ వెసులుబాటు

ఈ ఏడాది నుంచే 10, 12 తరగతి బోర్డు పరీక్షల్లో వర్తింపు

న్యూఢిల్లీ: 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల్లో దివ్యాంగ విద్యార్థులు (ప్రత్యేక అవసరాలున్నవారు) కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు వాడుకోవడానికి సీబీఎస్‌ఈ అనుమతించింది. ఈ ఏడాది నుంచే ఈ వెసులుబాటు అమల్లోకి రానున్నట్లు ఒక అధికారిక ప్రకటన వెలువడింది.పరీక్షా కేంద్రంలో సదరు విద్యార్థి కంప్యూటర్‌ వినియోగించుకోవచ్చని సిఫార్సు చేస్తూ అర్హుడైన వైద్యుడు సర్టిఫికేట్‌ జారీచేయాల్సి ఉంటుంది. అలా సిఫార్సు చేయడానికి తగిన కారణాలను అందులో పేర్కొనాలి. విద్యార్థి ఈ సర్టిఫికేట్‌ను పరీక్షా సమయంలో సమర్పించాలి.

సమాధానాలు టైప్‌ చేయడానికి, ప్రశ్నలను వినడానికి, వాటిని పెద్ద అక్షరాల్లో చూడటానికి మాత్రమే కంప్యూటర్‌ వినియోగాన్ని పరిమితం చేయాలని సీబీఎస్‌ఈ పేర్కొంది. విద్యార్థి ఫార్మాట్‌ చేసిన కంప్యూటర్‌/ల్యాప్‌టాప్‌ను తానే సొంతం గా వెంట తెచ్చుకోవాలని వెల్లడించింది. కంప్యూటర్‌ టీచర్‌ ఆ కంప్యూటర్‌ను పరీక్షించిన తరువాతే పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్‌ దాన్ని అనుమతించాలని తెలిపింది. ఆ కంప్యూటర్‌కు ఇంటర్నెట్‌ ఉండొద్దని షరతు విధించింది. పరీక్ష రాసే సహాయకుడి బదులు ప్రశ్నా పత్రం చదివి వినిపించే రీడర్‌ కావాలన్నా తీసుకునే ప్రతిపాదనకూ సీబీఎస్‌ఈ అంగీకరించింది. 

మరిన్ని వార్తలు