కోట్లాది గుండెలు కొల్లగొట్టి నిష్క్రమించారు

25 Feb, 2018 08:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సీనియర్‌ నటి శ్రీదేవి(54) హఠాన్మరణంతో యావత్‌ భారత సినీ పరిశ్రమ, ప్రేక్షక లోకం దిగ్భ్రాంతికి గురైంది. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు ఆమె మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో సంతాపం తెలియజేశారు. 

శ్రీదేవి మృతి వార్త విని షాక్‌కి గురయ్యా. కోట్లాది అభిమానుల గుండెబద్ధలు కొట్టేసి ఆమె వెళ్లిపోయారు. ముండ్రమ్‌ పిరై, లమ్హే, ఇంగ్లీష్‌ వింగ్లీష్‌ లాంటి చిత్రాలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయి. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా అని రాష్ట్రపతి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

నటి శ్రీదేవి మరణం బాధాకరం. చిరస్మరణీయ పాత్రలతో అలరించిన దిగ్గజ నటి. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ... ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా అని ప్రధాని నరేంద్ర మోదీ తెలియజేశారు. 

సినీ ప్రముఖులు, క్రీడాకారులు, జాతీయ స్థాయి నేతలతోపాటు మరోవైపు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు కూడా ఆమె మృతికి సంతాపం తెలియజేశారు. బహుబాషా నటిగా, తెలుగువారికి అత్యంతం ఇష్టమైన కథానాయికగా, దేశం గర్వించదగ్గ నటిగా ఎదిగారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇక శ్రీదేవి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్నతనం నుంచే నటిస్తూ కోట్లాది మంది అభిమానులను ఆమె సంపాదించుకున్నారని.. తక్కువ వయసులోనే ఆమె మరణించడం భాదాకరమన్నారు.ఆమె పోషించిన పాత్రలు ఆమెను అభిమానుల గుండెల్లో చిరస్మరణీయంగా ఉంచుతాయని ఆయన అన్నారు. ఇంకా పలువురు నేతలు ఆమె మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు