ఆవులకు ‘రాజ’స్థానం..

6 Jul, 2017 03:06 IST|Sakshi
ఆవులకు ‘రాజ’స్థానం..
రాజస్తాన్‌లో సామాన్యుడిని మించి సెలబ్రిటీ స్టేటస్‌ అనుభవిస్తున్న జీవి ఏంటో తెలుసా? ఆవు.. అవును ఆవే.. ఎందుకంటే.. అక్కడి బీజేపీ ప్రభుత్వం ఒక్కో ఆవు పోషణకు రోజుకు రూ.70 అందించనుంది.. దూడ కూడా ఉంటే మరో రూ.35.. అదే సమయంలో సామాన్యులకు ఉద్దేశించిన సంక్షేమ పథకాల కోసం వెచ్చిస్తున్న మొత్తం ఒక్కొక్కరికి రూ.26.65 మాత్రమే. ఇక్కడ నగరాల్లో నివసిస్తూ రోజుకు రూ.28 కంటే తక్కువ సంపాదిస్తున్న వారిని దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్‌) ఉన్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అలాగే గ్రామాల్లో రూ.25.16 కంటే తక్కువ ఆదాయం ఉన్న వారిని ఈ కేటగిరీలోకి చేర్చింది.

నిరుపేదల సంక్షేమానికి నిధులు వెచ్చించడానికి ఆలోచించే సర్కారు.. ఇలా గోవులకు మాత్రం భారీ మొత్తంలో నిధులు ధారపోస్తోందంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే, సంరక్షణ లేక వేలాది ఆవులు చనిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన సమావేశంలో రోజుకు ఆవుకు రూ.32, దూడకు రూ.16 చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. అయితే గత నెల జరిగిన భేటీలో దాన్ని దాదాపు రెట్టింపు చేశారు. ఈ మొత్తాన్ని సమకూర్చుకోవడానికి వివిధ రకాల లావాదేవీలపై 10 శాతం చొప్పున ఆవు పన్నును కూడా విధించారు. ఈ మొత్తం సరిగ్గా వినియోగమవుతుందా లేదా అన్నది చూసేందుకు గోశాలలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిధులను ఆవుల ఆహారం నిమిత్తం ఉపయోగించాల్సి ఉంటుంది. ఆవుల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన రాష్ట్రం రాజస్తానే కావడం విశేషం. 
– సాక్షి, తెలంగాణ డెస్క్‌
 
ఒక్కో ఆవు కోసం రోజుకు వెచ్చించనున్న మొత్తం (రూ.లలో) 70
ఒక్కో దూడ కోసం రోజుకు వెచ్చించనున్న మొత్తం (రూ.లలో) 35
బీపీఎల్‌కు దిగువనున్న పేదలకు (ఒక్కొక్కరికి) వెచ్చిస్తున్న మొత్తం (రూ.లలో) 26.65

 

మరిన్ని వార్తలు