యాక్టివ్‌ కేసుల కంటే రికవరీ రేటు ఎక్కువ

14 Jul, 2020 16:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 9 లక్షలు దాటినప్పటికీ రికవరీ రేటు కూడా పెరగడం ఊరటనిచ్చే అంశమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మే 2 నుంచి 30 మధ్య రికవరీ కేసుల కంటే కోవిడ్‌ కేసుల సంఖ్య అధికంగా ఉండేదని, ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల కంటే రికవరీ రేటు 1.8 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. దేశంలోని 20  రాష్ట్రాలలో రికవరీ రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందని.. మొత్తంగా దేశంలో కరోనా రికవరీ రేటు 63 శాతంగా ఉందని తెలిపింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గుజరాత్‌లో రికవరీ రేటు అత్యధికంగా(70 శాతం) ఉందని పేర్కొంది. (9 లక్షలు దాటిన కరోనా కేసులు)

ఇక కరోనా కేసుల వృద్ధిరేటు గణనీయంగా తగ్గుతోందని, ప్రస్తుతం ఇది 3.4 శాతంగా ఉందని వెల్లడించింది. ప్రతీ 10 లక్షల జనాభాకు 657 కేసులు నమోదవుతున్నాయని.. 8 రాష్ట్రాల నుంచి 36 శాతం కేసులు నమోదయ్యాయని తెలిపింది. మొత్తం పది రాష్ట్రాల నుంచి 86 శాతం కేసులు నమోదవుతున్నట్లు పేర్కొంది. దేశంలో మొత్తం కరోనా కేసులలో 50 శాతం మహారాష్ట్ర, తమిళనాడుకు చెందినవేనని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఓఎస్‌డీ రాజేశ్‌ భూషణ్‌ మంగళవారం వివరాలు వెల్లడించారు.

మరిన్ని వార్తలు