రిటైర్మెంట్‌ గడువు పెంచం: కేంద్రం

1 Apr, 2020 08:38 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని, గడువు పొడిగించే ప్రతిపాదనేదీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. పదవీ విరమణ వయస్సు ముగిసిన వారు నిబంధనల మేరకు మార్చి 31వ తేదీన రిటైర్‌ కావాల్సిందేనని తెలిపింది. దేశవ్యాప్తంగా నెలకొన్న అసాధారణ పరిస్థితులున్నప్పటికీ ఉద్యోగుల పదవీ కాలాన్ని పెంచడం లేదని సిబ్బంది శాఖ వివరించింది. లాక్‌డౌన్‌ కారణంగా వారు ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్నా లేదా కార్యాలయానికి హాజరవుతున్నా నిబంధన –56 ప్రకారం మార్చి 31, 2020న రిటైర్‌ కావాల్సిందేనని పేర్కొంది.  
(చదవండి: కొంపముచ్చిన మొక్కుబడి హెచ్చరికలు)

ప్రభుత్వం ఆ రోజులను లెక్కించదు
న్యూఢిల్లీ: గడువు ముగిసేలోగా సస్పెన్షన్‌ ఉత్తర్వులను సమీక్షించడం, ప్రభుత్వాధికారులు స్వచ్ఛంద పదవీ విరమణ నోటీసులను అంగీకరించడం వంటివి లాక్‌ డౌన్‌ సమయంలో పరిగణించబోమని కేంద్ర సిబ్బంది శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పలు విధుల గడువు కాలాన్ని పెంచనున్నట్లు తెలిపింది. ఉదాహరణకు ఒక పనిని పూర్తి చేయడానికి ప్రభుత్వం 20 రోజుల గడువు విధిస్తే, లాక్‌ డౌన్‌ మధ్యలో రావడం వల్ల ఆ పని ఆగిపోతుంది. ఈక్రమంలో లాక్‌డౌన్‌ కాలాన్ని ప్రభుత్వం పరిగణించదు. లాక్‌డౌన్‌ ఎత్తివేశాక ఆ పనిని పూర్తి చేసేందుకు మళ్లీ 20 రోజుల కాలం ఉంటుంది. విధిని పూర్తి చేసేందుకు 15 రోజుల కంటే తక్కువ సమయం ఉంటే, లాక్‌ డౌన్‌తర్వాత దాన్ని పూర్తి చేసేందుకు 15 రోజుల వరకూ గడువు ఉంటుంది. 
(చదవండి: మగాళ్లూ.. ఇంటి పనులు చేయండి: సీఎం)

మరిన్ని వార్తలు