సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదనపు కరవు సాయం కింద కేంద్రం 900.40 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. మొత్తం ఆరు రాష్ట్రాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక నిధుల నుంచి 7,214.03 కోట్ల రూపాయలను మంజూరు చేస్తు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంది. మంగళవారం జరిగిన ఈ కమిటీ సమావేశంలో రాజ్నాథ్ సింగ్తోపాటు, కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్, వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
2018-19 ఏడాదిలో వరదలు, కొండచరియలు విరిగిపడటం, గజా తుపాను, అకాల వర్షాలు, కరవు పరిస్థితులు వాటిల్లిన రాష్ట్రాలకు కేంద్రం ఈ సహాయాన్ని ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన మొత్తంలో హిమచల్ ప్రదేశ్లో వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల జరిగిన నష్టానికి సహాయంగా 317.44 కోట్లు, ఉత్తరప్రదేశ్కు వరద సహాయంగా 191.73 కోట్లు, ఏపీకి కరవు సహాయంగా 900.40 కోట్లు, కర్ణాటకకు కరవు సహాయంగా 949.49 కోట్లు, మహారాష్ట్రకు కరవు సహాయంగా 4,714.28 కోట్లు, గుజరాత్కు కరవు సహాయంగా 127.60 కోట్లు, పుదుచ్చేరికి తుపాన్ సహాయంగా 13.09 కోట్ల రూపాయలు కేటాయించింది.