సుప్రీంకోర్టులో ఈసీ, కాంగ్రెస్‌ వాగ్వాదం!

9 Oct, 2018 04:15 IST|Sakshi

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ రాష్ట్రాల ఓటర్ల జాబితాలపై సుప్రీంకోర్టు సాక్షిగా కేంద్ర ఎన్నికల సంఘం, కాంగ్రెస్‌ పార్టీ వాగ్వాదానికి దిగాయి. ఓటర్ల జాబితాలో నకిలీఓట్ల అంశంపై దాఖలైన కేసులను జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ల సుప్రీంకోర్టు బెంచ్‌ సోమవారం విచారణ ముగించి తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో ఎన్నికల అక్రమాలపై కాంగ్రెస్‌ నేతలు కమల్‌నాథ్, సచిన్‌ పైలట్లు కేసు వేయగా వీరి తరఫున కపిల్‌ సిబల్‌ సుప్రీంకోర్టులో వాదించారు.

ఈ కేసులో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)ని ప్రతివాదిగా చేర్చగా, ఈసీ తరఫున న్యాయవాది వికాస్‌ సింగ్‌ వాదనలు వినిపించారు. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల నాటి కొన్ని వీవీప్యాట్‌లను చెక్‌చేయాలని సిబల్‌ వాదించారు. అయితే, ఓటర్ల జాబితాలో నకిలీఓట్లు ఉన్నా యని అసత్య ఆరోపణలు చేస్తూ, ఈసీలాంటి రాజ్యాంగబద్ధ సంస్థను అపఖ్యాతిపాలు చేయాలని కాంగ్రెస్‌ నేతలు కుట్రపన్నారని వికాస్‌ సింగ్‌ వాదించారు. అయితే, ఒక్క మధ్యప్రదేశ్‌లోనే 60 లక్షల నకిలీఓట్లు బయటపడ్డాయని, మరో 24 లక్షల ఓట్లను ఈసీనే తొలగించిందని సిబల్‌ వాదించారు.

మరిన్ని వార్తలు