కరోనా కట్టడికి జాతీయ మార్గదర్శకాలు

18 May, 2020 06:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  కరోనా వ్యాప్తి నియంత్రణకు గాను కేంద్ర ప్రభుత్వం తాజాగా కొన్ని జాతీయ మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని ప్రజలంతా కచ్చితంగా పాటించాలని సూచించింది. అవి ఏమంటే..  

► బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి. ఈ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నేరం. ఇందుకు రాష్ట్రాలు, స్థానిక యంత్రాంగాల చట్టా లు, నిబంధనలు అమల్లో ఉంటాయి.

► పబ్లిక్‌ ప్రదేశాల్లో, ప్రయాణ సమయాల్లో భౌతిక దూరం పాటించాలి.  

► వివాహాల్లో భౌతిక దూరం పాటించాలి. 50 మంది కంటే ఎక్కువ అతిథులు ఉండరాదు.

► అంతిమ సంస్కారాల సమయంలోనూ భౌతిక దూరం పాటించాలి. 20 మంది కంటే ఎక్కువ హాజరుకారాదు.  

► బహిరంగ ప్రదేశాల్లో మద్యం, పాన్, పొగాకు, గుట్కా వినియోగాన్ని అనుమతించరు.

► దుకాణాలు రెండు గజాల దూరం నియమాన్ని పాటించాలి. ఐదుగురు కంటే ఎక్కువ మందిని దుకాణాల వద్ద అనుమతించరాదు.
పని ప్రదేశాల్లో అదనపు మార్గదర్శకాలు

► వీలైనంత వరకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ప్రక్రియను అనుసరించాలి.

► కార్యాలయాలు, మార్కెట్లు, పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాల పని గంటలు నిర్ధిష్టంగా కాకుండా అస్థిరంగా ఉండాలి.  
 

► కార్యాలయాల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద, కామన్‌ ఏరియాల్లో థర్మల్‌ స్క్రీనింగ్, హ్యాండ్‌ వాష్, శానిటైజర్‌ వంటి సదుపాయాలు ఉండాలి.

► డోర్‌ హ్యాండిళ్లు సహా సిబ్బంది తాకేందుకు అవకాశం ఉన్న అన్నింటినీ, కామన్‌ వసతులను, మొత్తం పని ప్రదేశాన్ని తరచుగా, శానిటైజ్‌(క్రిమి రహితం) చేయాలి.

► సిబ్బంది మధ్య భౌతిక దూరం ఉండేలా కార్యాలయ ఇన్‌ఛార్జులు శ్రద్ధ తీసుకోవాలి. అలాగే షిఫ్టుల మధ్య తగినంత అంతరం ఉండేలా జాగ్రత్తపడాలి.

మరిన్ని వార్తలు