లాక్‌డౌన్‌: గల్ఫ్ బాధితులకు శుభవార్త!

28 Apr, 2020 17:08 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా లాక్‌డౌన్‌ కారణంగా గల్ఫ్ దేశాలలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ మేరకు ఎయిర్‌ ఇండియా, ఇండియన్‌ నావీలను రంగంలోకి దించుతోంది. వివిధ గల్ఫ్ దేశాలలో దాదాపు 10 మిలియన్ల వరకు భారతీయులు ఉంటారని కేంద్రం అంచనా వేస్తోంది. ఇందుకు సంబంధించిన పక్కా సమాచారం ఇవ్వాలని రాష్ట్రాలను కోరింది. అంతేకాకుండా భారతీయులను గల్ఫ్‌ దేశాలనుంచి ఇండియాకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని ఎయిర్ ఇండియా, ఇండియన్ నేవీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు సంస్థలు ఎంత మందిని తరలించగలుగుతాయో ప్రణాళికలు ఇవ్వాలని కోరింది. దీనిపై స్పందించిన ఇండియన్‌ నేవీ తమకు ఉన్న మూడు యుద్ధ నౌకల ద్వారా గల్ఫ్ దేశాల పోర్ట్ సిటీలలో ఉన్న వారిలో 1500 మంది వరకు తరలిస్తామని వెల్లడించింది. ( ‘దేవుడు కోరాడనే సాధువులను చంపేశా’ )

తమ దగ్గర 500 వరకు విమానాలు సిద్ధంగా ఉన్నాయని పౌరవిమానయాన శాఖ తెలిపింది. గల్ఫ్ దేశాలలోని భారతీయులను తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్ర విదేశాంగ శాఖ సంప్రదింపులు జరుపుతోంది. వచ్చేనెల 3 తరువాత తరలింపు ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అయితే గల్ఫ్ దేశాలలో చిక్కుకున్న వారిలో ఎక్కువ మంది కార్మికులు ఉన్నందున తరలింపు ఖర్చు ఎవరు భరించాలి అనే విషయంపై కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు