చైనాకు వెళ్లకండి.. 

18 Jan, 2020 03:50 IST|Sakshi

భారత పర్యాటకులకు కేంద్రం హెచ్చరిక

చైనాలో ప్రమాదకర వైరస్‌ వ్యాప్తి

ఢిల్లీ: చైనాలో ప్రమాదకర ‘నావల్‌ కరొనా’ వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో చైనా వెళ్లే భారతీయులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అంతేగాక చైనా నుంచి తిరిగివస్తున్న యాత్రికులను కేంద్ర ఆరోగ్య శాఖ థర్మల్‌ స్కానర్లతో పరీక్షిస్తోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల విమానాశ్రయాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.

చైనాలో ఈ వైరస్‌ 41 మందికి సోకగా, ఒకరు మృతి చెందారని ఆదేశం ఈ నెల 11న ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్‌ లేనప్పటికీ చైనాలో ఒకరి నుంచి ఒకరికి దగ్గు, తుమ్ముల ద్వారా కూడా ఈ వ్యాధి సోకుతోందని గుర్తించారు. దీంతో అలర్ట్‌ అయిన కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)తో కలసి నియంత్రణ కోసం కృషి చేస్తోందని ఆ శాఖ ప్రధాన కార్యదర్శి ప్రీతి సుడాన్‌ చెప్పారు.

ఇవీ జాగ్రత్తలు.. 
ఈ వైరస్‌ గురించి ఎక్కువగా తెలియకపోయినప్పటికీ కొన్ని జాగ్రత్తలను కేంద్రం సూచిస్తోంది. పొలాలకు, జంతుశాలలకు, జంతువధ స్థానాలకు వెళ్లవద్దని తెలిపింది. మాంసానికి దూరంగా ఉండాలని, ఒకవేళ తినాల్సి వస్తే బాగా ఉడికించిన మాంసాన్ని తీసుకోవాల్సిందిగా సూచించింది.

>
మరిన్ని వార్తలు