అలా అయితే ఆఫీస్‌కు రావద్దు : కేంద్రం

29 Apr, 2020 14:09 IST|Sakshi

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకట్ట వేయడానికి ప్రతి ఒక్కరు ఆరోగ్య సేతు ఉపయోగించాలని కేంద్రం చెబుతున్న సంగతి తెలిసిందే. అలాగే కరోనా తాజా సమాచారంతో పాటుగా వైరస్‌ వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన జాగ్రత్తలు, కేంద్రం అనుసరిస్తున్న నియంత్రణ చర్యలు వంటి అంశాలను అందించే ఆరోగ్య సేతు యాప్‌ను ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా వినియోగించేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగుల భద్రత దృష్ట్యా కేంద్రం బుధవారం మరిన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది తమ మొబైల్‌ ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆదేశించింది.

ఆఫీస్‌కు బయలుదేరే ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ఆరోగ్య సేతు యాప్‌ తమ స్టేటస్‌ను చెక్‌ చేసుకోవాలని.. యాప్‌లో ‘సేఫ్’ లేదా ‘లో రిస్క్‌’ అని చూపెడితేనే ఆఫీస్‌కు రావాలని సూచించింది. ఒకవేళ బ్లూటూత్‌ సామీప్యత ఆధారంగా యాప్‌లో ‘మోడరేట్’ లేదా ‘హై రిస్క్‌’ అని స్టేటస్‌ చూపెడితే ఆఫీస్‌కు రానవసరం లేదని తెలిపింది. అటువంటి వారు 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండటం కానీ, యాప్‌లో స్టేటస్‌ లో రిస్క్‌ లేదా సేఫ్‌ అని చూపెట్టేవరకు ఇంటివద్దే ఉండాలని సూచించింది. కేంద్ర మంత్రిత్వశాఖల్లో, కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఈ ఆదేశాలు తప్పకుండా అమలయ్యే చూడాలని జాయింట్‌ సెక్రటరీలను ఆదేశించింది.

చదవండి : ఆరోగ్య సేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి

మరిన్ని వార్తలు