సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం ప్రపంచ దేశాలన్ని వ్యాక్సిన్ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలో మన దేశంలో ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు భారత వైద్య పరిశోధనా మండలి శరవేగంగా ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ ప్రయోగం గురించి పలు అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ వ్యాక్సిన్ల తయారీలో భద్రతకు పూర్తి భరోసా ఇస్తామని ప్రకటించింది. సంప్రదాయ పద్దతిలో వ్యాక్సిన్ రావడానికి రెండేళ్లు పడుతుంది.. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపింది. వ్యాక్సిన్ విషయంలో ఇప్పటికే జంతువుల పై ప్రయోగం సక్సెస్ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. (సామాజిక బాధ్యత అభినందనీయం)
గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 62శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మృతి చెందిన వారిలో 30-44 ఏళ్లలోపు వారు 11శాతం ఉండగా.. 45-59 ఏళ్లలోపు వారు 32 శాతం.. 60-70 ఏళ్లలోపు వారు 39శాతం.. 75 ఏళ్లలోపు వారు 14శాతంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇతర దేశాలతో పోల్చితే భారత్లో తక్కువ కేసులు నమోదవుతున్నయని తెలిపింది.