గాంధీ శాంతి బహుమతి విజేతలు వీరే

17 Jan, 2019 04:28 IST|Sakshi

న్యూఢిల్లీ: 2015 నుంచి 2018 వరకు నాలుగేళ్ల కాలానికి గాంధీ శాంతి బహుమతుల విజేతల పేర్లను కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. చివరిగా 2014లో ఈ పురస్కారాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు ప్రదానం చేశారు. 2015 నుంచి ఎవరికీ ఇవ్వలేదు. గాంధీ సిద్ధాంతాలు, పద్ధతుల ద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పు కోసం కృషిచేసే వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులు ఇస్తారు. తాజాగా ప్రకటించిన అవార్డుల్లో 2015 ఏడాది విజేతగా కన్యాకుమారికి చెందిన వివేకానంద కేంద్రను ఎంపిక చేశారు.

పాకీ పని చేసే వారికి విముక్తి కల్పించినందుకు సులభ్‌ ఇంటర్నేషనల్‌కు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందిస్తున్నందుకు అక్షయపాత్ర ఫౌండేషన్‌కు కలిపి 2016 ఏడాదికి గాంధీ శాంతి అవార్డును ప్రకటించారు. 2017 ఏడాదికి ఏకై అభియాన్‌ ట్రస్ట్‌ను, 2018కి కుష్టు వ్యాధి నిర్మూలన కోసం డబ్ల్యూహెచ్‌వో సౌహార్ద్ర రాయబారిగా ఉన్న యోహీ ససకవాకు అవార్డులను ప్రకటించారు. ఈ బహుమతి కింద రూ.కోటితోపాటు ప్రశంసాపత్రం ఇస్తారు.

మరిన్ని వార్తలు