ఆ విద్యా సంస్థలకు రూ లక్ష కోట్లు

19 Jun, 2018 08:35 IST|Sakshi
కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక వసతుల మెరుగుదలకు కేంద్రం భారీగా నిధులు వెచ్చించనుంది. ఆయా సంస్థల్లో మౌలిక వసతుల ఆధునీకరణకు ఉన్నత విద్య ఫండింగ్‌ ఏజెన్సీ (హెచ్‌ఈఎఫ్‌ఏ) రూ లక్ష కోట్లు ఖర్చు చేస్తుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ పేర్కొన్నారు. 2022 నాటికి ఉన్నత విద్యా రంగంలో మౌలిక సౌకర్యాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించి, వ్యవస్థలను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్రం భారీగా నిధులను వెచ్చించాలని నిర్ణయించిందని చెప్పారు. ఉన్నత విద్యారంగానికి బడ్జెట్‌ కేటాయింపులకు అదనంగా హెచ్‌ఈఎఫ్‌ఏ నిధులు సమకూరుస్తుందన్నారు.

గత నాలుగేళ్లలో విద్యా రంగంలో బీజేపీ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులను చేపట్టిందని ప్రకాష్‌ జవదేకర్‌ తెలిపారు. కాగా, నరేంద్ర మోదీ ప్రభుత్వం 2016-17 కేంద్ర బడ్జెట్‌లో హెచ్‌ఈఎఫ్‌ఏ ఏర్పాటును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ నిధులను సమీకరించి ఉన్నత విద్యాసంస్థలకు వడ్డీరహిత రుణాలుగా నిధులను అందుబాటులోకి తెస్తుంది. హెచ్‌ఈఎఫ్‌ఏను ఆర్‌బీఐ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థగా (ఎన్‌బీఎఫ్‌సీ) గుర్తించింది. 

మరిన్ని వార్తలు