శ్రీనగర్‌లో భారీ ఆందోళనలు అంటూ కథనాలు

10 Aug, 2019 14:53 IST|Sakshi
భద్రత బలగాల నీడలో కశ్మీర్‌

న్యూఢిల్లీ: ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తూ శ్రీనగర్‌లో దాదాపు 10వేలమంది ప్రజలు గుమిగూడి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించినట్టు వచ్చిన కథనాలను కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఖండించింది. ఇవి అసత్య.. కల్పిత కథనాలని హోంశాఖ స్పష్టం చేసింది. ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ విభజన అనంతరం శ్రీనగర్‌, బారాముల్లా ప్రాంతాల్లో చిన్నాచితక ఆందోళనలు చోటుచేసుకున్నాయని, అంతకుమించి ఎలాంటి ఘటనలు జరగలేదని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. 20, 30 మంది ప్రజలు గుమిగూడి పలుచోట్ల చిన్నస్థాయిలో నిరసనలు తెలిపారని, అంతేకానీ, పదివేలమందితో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారన్న మీడియా కథనాలు అసత్యమని ఓ ప్రకటనలో తెలిపంది.

శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత శ్రీనగర్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకున్నాయని, దాదాపు పదివేల మంది ఆందోళనకారులు శ్రీనగర్‌ నగరం నడిబొడ్డు వైపు ర్యాలీగా కదిలి నిరసన తెలిపారని, తమకు స్వేచ్ఛా కావాలని, ఆర్టికల్‌ 370 రద్దును అంగీకరించేది లేదని ఆందోళనకారులు నినదించారని కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి.. టియర్‌ గ్యాస్‌లు, పెల్లెట్లు ప్రయోగించి.. నిరసనకారులను చెల్లాచెదురు చేసి.. ఆందోళనను అణచివేశారని ఆ కథనాలు చెప్పుకొచ్చాయి.

మరిన్ని వార్తలు