న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విధించిన రెండోసారి లాక్డౌన్ను పలు రాష్ట్రాలు కఠినంగా అమలు చయకపోవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యవసరం కాని సేవలకు అనుమతినిస్తూ నిబంధనలు సడలించడంపై మండిపడింది. ఇలాంటి ఏమరపాటు చర్యల వల్ల కరోనా విజృంభించే అవకాశముందని హెచ్చరించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్ల సోమవారం లేఖ రాశారు. తక్షణమే అన్ని రాష్ట్రాలు కఠిన నిబంధనలు పాటించాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేశారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రజల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశముందని హెచ్చరించారు. (లాక్డౌన్: కేరళ సర్కారుపై కేంద్రం సీరియస్!)
ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు నిర్లక్ష్యంగా లాక్డౌన్ సడలింపు చేయడం వల్ల పలు చోట్ల సామాజిక ఎడబాటును ఉల్లంఘించడమే కాక పట్టణ ప్రాంతాల్లో స్వేచ్ఛగా వాహనదారులు రోడ్ల మీదకు వస్తున్నారన్న విషయాలు తమ దృష్టికి వచ్చాయన్నారు. కాబట్టి వెంటనే రెండవసారి లాక్డౌన్ అమలు చేయడంపై కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని సూచించారు. ఇదిలావుండగా ఇండోర్, ముంబై, పుణె, జైపూర్, కోల్కతా, హౌరా, మెదినీపూర్ ఈస్ట్, డార్జిలింగ్, కలింపోంగ్, జల్పైగురి నగరాల్లో కరోనా పరిస్థితి తీవ్రంగా ఉందన్నారు. రాష్ట్రాల్లో కోవిడ్-19 పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి, అందుకవసరమైన సూచనలు చేయడానికి, లాక్డౌన్ అమలును పర్యవేక్షించడానికి ఆరు ఐఎమ్సీటీ(ఇంటర్ మినిస్టరియల్ సెంట్రల్ టీమ్స్)లను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. (శానిటైజర్ తయారీ పరిశ్రమలో పేలుడు)