థియేటర్లలో జనగణమన.. కేంద్రం యూటర్న్‌

9 Jan, 2018 09:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సినిమాహాల్లో జాతీయ గీతాలాపన విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. జనగణమన ప్రదర్శితమవుతున్న సమయంలో ప్రేక్షకులు తప్పనిసరిగా లేచి నిల్చొవాల్సిందేనని గతంలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ఆదేశాలను నిలుపుదల చేసినట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.  

సోమవారం సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. సినిమా మొదలయ్యే ముందు థియేటర్లలో జాతీయ గీతం అక్కర్లేదని కోర్టుకు తెలియజేసింది. జాతీయ గీతాన్ని ఎక్కడ? ఎప్పుడు? ఆలపించాలనే దానిపై మార్గదర్శకాల రూపకల్పన కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఏర్పాటు చేసినట్టు కేంద్రం పేర్కొంది. ఆ కమిటీ ఆరు నెలల్లో నివేదిక ఇస్తుందని, అప్పటి వరకు తాము ఇచ్చిన ఆదేశాలు నిలుపుదల చేసి 30 నవంబరు 2016 తీర్పు ముందునాటి స్థితిని పునరుద్ధరించాలని కోరింది. కాగా, నేడు ఈ వ్యవహారంలో దాఖలైన పిల్‌ విచారణకు రానుంది. 
 
జాతీయ గీతాలాపనకు సినిమా హాళ్లు వేదిక కాకూడదని దేశ వ్యాప్తంగా చర్చలు జరిగాయి. ఈ మేరకు ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది. పౌరులు తమలోని దేశభక్తిని ఇలా నిరూపించుకోవాల్సిన అవసరం లేదని గతంలో న్యాయస్థానం తేల్చి చెప్పిన విషయం విదితమే. దీంతో తర్జన భర్జన పడిన ప్రభుత్వం దిగి వచ్చి ఈ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని వార్తలు