5 శాతం వ్యాట్‌ తగ్గించండి

5 Oct, 2017 03:14 IST|Sakshi

డీజిల్, పెట్రోల్‌పై రాష్ట్రాలకు కేంద్రం సూచన

న్యూఢిల్లీ: సామాన్యునికి మరింత ఊరట కలిగించేలా ఇంధన ధరలపై వ్యాట్‌ లేదా అమ్మకం పన్నును 5 శాతం తగ్గించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు త్వరలోనే లేఖలు రాయనున్నట్లు చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ బుధవారం వెల్లడించారు. ‘మేం చొరవ తీసుకుని డీజిల్, పెట్రోల్‌ ఎక్సైజ్‌ సుంకాన్ని కుదించాం. ఇక రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించే సమయమొ చ్చింది.

కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రాలు వ్యాట్‌ లేదా అమ్మకం పన్నును తగ్గించాలని కోరుతున్నాం. ఇంధనం నుంచి లభిస్తున్న ఆదాయంలో ఎక్కువగా ప్రయోజనం పొందుతున్నది రాష్ట్రాలే. వ్యాట్‌కు అదనంగా, కేంద్ర ఎక్సైజ్‌ వసూళ్లలో 42 శాతం వారి ఖాతాలోకే చేరుతోంది’ అని ప్రధాన్‌ తెలిపారు.  రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై 26–38% వ్యాట్‌ విధిస్తున్నాయి. వ్యాట్‌ను కుదించడంపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాలని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ రాష్ట్రాలను కోరారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని కేంద్రం లీటరుకు రూ.2 చొప్పున తగ్గించిన సంగతి తెలిసిందే.

రూ.2.50 తగ్గిన పెట్రోల్‌
కేంద్రం ఎక్సైజ్‌ సుంకంలో కోత విధించిన నేపథ్యంలో బుధవారం పెట్రోల్‌ ధర లీటరుకు రూ.2.50, డీజిల్‌ రూ.2.25 మేర తగ్గాయి. రాజ ధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.68.38కి, డీజిల్‌ ధర రూ.58.69కి చేరినట్లు ఐఓసీ తెలిపింది.  

మరిన్ని వార్తలు