జూలై 15న చంద్రయాన్‌ -2 ప్రయోగం

12 Jun, 2019 18:44 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూన్‌ మిషన్‌.. చంద్రయాన్‌-2 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. 2019 జూలై 15న ప్రయోగం చేపడతామని ఇస్రో చైర్మన్ డా. కె.శివన్ ప్రకటించారు. ఈ ప్రయోగానికి రూ. 1000 కోట్లు ఖర్చయ్యాయని వెల్లడించారు. జూలై 15 తెల్లవారుజామున 2 గంటల 51 నిమిషాలకు చంద్రయాన్-2 ప్రయోగాన్ని నిర్వహిస్తామని చెప్పారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జీఎస్ఎల్వీ మార్క్-3 వాహకనౌక ద్వారా ఈ ప్రయోగం చేపడతామని పేర్కొన్నారు. దీని ద్వారా చంద్రగ్రహంపైకి ఆర్బిటార్, ల్యాండర్, రోవర్‌ను ప్రవేశపెట్టనున్నారు. ల్యాండర్‌కు విక్రమ్ అని, రోవర్‌కు ప్రగ్యాన్ అని నామకరణం చేశారు.

 చంద్రయాన్-2 వ్యవస్థ మొత్తం బరువు 3,447 కేజీలు కాగా, వీటిలో ఒక్క ప్రొపెల్లర్ బరువే ఏకంగా 1,179 కేజీలు ఉంటుందని చెప్పారు. ఓసారి ఉపగ్రహాన్ని ప్రయోగించాక, ఇది స్వతంత్రంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు. 2019 సెప్టెంబర్ 6 లేదా 7 తేదీల్లో ల్యాండర్ చంద్రుడిపై దిగుతుందని వెల్లడించారు. ఈ ప్రయోగం విజయవంతం కోసం దశాబ్దాలుగా భారత శాస్త్రవేత్తలు కృషిచేస్తున్నారు. ఈ ప్రయోగం తర్వాత లభించే సమాచారం ఆధారంగా ఇస్రో తదుపరి తన వ్యూహాలను అమలు చేయనుంది.

మరిన్ని వార్తలు