చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్‌–2

20 Aug, 2019 10:45 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: యావత్తు దేశం ఆతృతగా ఎదురుచూస్తున్న చంద్రయాన్‌-2 ప్రయాణం సాఫీగా సాగుతోంది. ప్రతిష్టాత్మక చంద్రయాన్‌–2 ప్రయోగంలో మరో కీలకఘట్టం విజయవంతంగా ముగిసింది. లూనార్‌ ట్రాన్స్‌ఫర్‌ ట్రాజెక్టరీలో చక్కర్లు కొడుతున్న చంద్రయాన్‌–2 ఉపగ్రహం చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. మంగళవారం 8.30 నుంచి 9.30 గంటల మధ్యలో చంద్రయాన్‌–2 ఉపగ్రహాన్ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. అంచనాలను అందుకుంటూ సరిగ్గా  9:20 గంటలకు కక్ష్యలోకి చేరింది. ప్రయోగించిన 29 రోజుల తర్వాత చంద్రయాన్‌-2 వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి చేరింది. 

సెప్టెంబర్‌ 2వ తేదీన ఉపగ్రహం నుంచి విక్రమ్‌ ల్యాండర్‌ విడిపోతుందని  ఇస్రో చైర్మన్‌ శివన్‌ తెలిపారు. బెంగళూరు సమీపంలో గల బైలాలులోని ఇండియన్‌ డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌ యాంటెన్నాల సాయంతో ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌లోని మిషన్‌ ఆపరేషన్స్‌ కాంప్లెక్స్‌ నుంచి ఉపగ్రహ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇంతవరకు ఉపగ్రహంలోని అన్ని వ్యవస్థలు బాగా పనిచేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది.  చంద్రయాన్‌–2 ఉపగ్రహాన్ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టడం అత్యంత సవాల్‌తో కూడుకున్న విషయమని ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ అన్నారు.  గత నెల 22న చంద్రయాన్‌–2ను ప్రయోగించారు.

మరిన్ని వార్తలు