ఫన్‌రైడ్‌లో అపశ్రుతి; 12 మందికి తీవ్ర గాయాలు

21 Jun, 2019 18:07 IST|Sakshi

చెన్నై : చెన్నైలోని క్వీన్స్‌లాండ్‌ అమ్యూజ్‌మెంట్‌ పార్కులో ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. ఫన్‌రైడ్‌లో భాగంగా పది అడుగుల ఎత్తు పై నుంచి జారి పడిపోవడంతో సుమారు 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ‘ఫ్రీ ఫాల్‌ టవర్‌’ పేరిట ఏర్పాటు చేసిన ఈ రైడ్‌లో స్టీల్‌ కేబుల్స్‌ తెగిపోవడంతో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ఘటనతో పార్కు వచ్చిన వారు భయాందోళనకు గురయ్యారు. పార్కు నిర్వహణ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.

కాగా ఈ విషయం గురించి పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. నాణ్యత లేని పరికరాలను ఉపయోగిస్తున్న పార్కు నిర్వాహకులకు ఇటీవలే నోటీసులు ఇచ్చామని తెలిపారు. అయినప్పటికీ తీరు మార్చుకోలేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇక కేవలం పది అడుగుల ఎత్తు నుంచి పడిపోయిన కారణంగా పెను ప్రమాదం తప్పిందని ఫన్‌రైడ్‌కు వెళ్లిపోయిన వారు పేర్కొన్నారు. ఒకవేళ పూర్తిగా పైకి వెళ్లిన సమయంలో కేబుల్‌ తెగిపోయి ఉంటే చాలా మంది ప్రాణాలు కోల్పోయేవారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

మరిన్ని వార్తలు