75 బస్సుల్లో స్వస్థలాలకు విద్యార్థులు

28 Apr, 2020 14:32 IST|Sakshi

రాయ్‌పుర్‌(ఛత్తీస్‌ఘడ్‌) : లాక్‌డౌన్‌తో రాజస్థాన్‌లోని కోటా వద్ద చిక్కుకుపోయిన 2వేల మంది విద్యార్దులు 75 బస్సుల్లో ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌కు చేరుకున్నారు. వీరికి రాయ్‌పుర్‌లో స్క్రీనింగ్ పరీక్షలు జరిపించి ఇళ్లకు పంపిస్తున్నారు. ఐఐటీ-జేఈఈ, నీట్‌ కోచింగ్‌కు కోటాలో ప్రత్యేకమైన శిక్షణ సంస్థలు ఉన్నాయి. ప్రతియేటా లక్షల సంఖ్యలో విద్యార్థులు వివిధ రాష్ట్రాల నుంచి అక్కడికి వెళుతుంటారు. ఈ ఏడాది కూడా అలాగే వెళ్లి లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయారు. అయితే ఇతర రాష్ట్రాల విద్యార్థులను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించి అక్కడి నుంచి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి.

లాక్‌డౌన్‌తో వలస కార్మికులు, ఆయా చోట్ల చిక్కుకుపోయిన విద్యార్దుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట విదానం పాటించకపోవడంపై పలు విమర్శలు వ్యక్తమవుతోన్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాజస్తాన్ లోని కోటా వద్ద నిలిచిపోయిన యూపీ విద్యార్దుల కోసం 300 బస్ లు ఏర్పాటు చేసి తరలించింది. ఈ అంశంపై బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథపై మండిపడ్డారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర  మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. రాజస్థాన్‌లోని కోట నగరంలో చిక్కుకున్న విద్యార్థులను వెనక్కి తీసుకురావడం కుదరదని నితీశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించే వరకు విద్యార్థులను తీసుకురాలేమని చెప్పారు.(ఇప్పట్లో కుదరదు: సీఎం)

మరిన్ని వార్తలు