భర్త కోసం ఓ ఇల్లాలి సాహసం!

14 May, 2020 10:51 IST|Sakshi

రాయ్‌పూర్‌: మణిరత్నం దర్శకత్వంలో అరవింద్‌ స్వామి, మధుబాల జంటగా నటించిన రోజా చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినీ అభిమానుల మదిలో ఈ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. తీవ్రవాదుల చేత కిడ్నాప్‌కు గురైన తన భర్తను కాపాడుకోవడం ఓ సాధారణ మహిళ చేసే ప్రయత్నమే ఈ చిత్ర కథా సారాంశం. అచ్చు ఇలాంటి సంఘటనే ఒకటి ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. మావోయిస్టుల చేతిలో కిడ్నాప్‌కు గురైన కానిస్టేబుల్ కోసం భర్త ‌ భార్య చేసిన ప్రయత్నం అందరిని అబ్బురపరుస్తుంది. 

వివరాలు.. సంతోష్‌ కట్టం(48) అనే వ్యక్తి బీజాపూర్‌లోని భోపాలపట్నంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 4న కిరాణా సామాన్లు తీసుకురావడం కోసం బయటకు వెళ్లాడు. నాటి నుంచి కనిపించకుండా పోయాడు. అయితే సంతోష్‌ అప్పుడప్పడు చెప్పకుండా బయటకు వెళ్లేవాడు. రెండు మూడు రోజుల తర్వాత ఇంటికి వచ్చేవాడు. దాంతో సునీత మొదట్లో పెద్దగా ఆందోళన చెందలేదు. రోజులు గడుస్తున్నా భర్త ఇంటికి రాకపోవడంతో సునీతలో ఆందోళన మొదలయ్యింది. ఈ క్రమంలో సంతోష్‌ను మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారని తెలిసింది. ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది . ఆ తర్వాత ఇరుగుపొరుగు వారి సాయంతో తన భర్తను వెతకడం ప్రారంభించింది. (పోలీసు క్యాంటీన్‌లో కీచక పర్వం)

ఈ విషయం గురించి సునీత మాట్లాడుతూ.. ‘మా ఇల్లు మావోయిస్టులకు ప్రధాన కేంద్రంగా ఉండే సుక్మా జిల్లాకు పక్కనే ఉంది. దాంతో ఇక్కడ అప్పుడప్పుడు ఇలాటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందుకే నా భర్త కిడ్నాప్‌ విషయం తెలిశాక నేను పెద్దగా ఆందోళణ చెందలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశాక నాకు ఇంట్లో ఉండాలనిపించలేదు. ఇరుగు పొరుగు వారి సాయంతో నా భర్తను వెతకడం ప్రారంభించాను’ అని తెలిపారు. ఈ క్రమంలో మే 6న సునీత, ఆమె కుమార్తె, స్థానిక రిపోర్టరు, ఇరుగుపొరుగు వారితో కలిసి అడవిలోకి వెళ్లింది. నాలుగు రోజుల తర్వాత మావోల చెరలో ఉన్న తన భర్తను కనుగొన్నది. అయితే సునీత తన భర్తను కనుగోవడం ఒక్క రోజు ఆలస్యమైన తీవ్ర పరిణామాలు చూడాల్సి వచ్చేది. 

ఎందుకంటే మే 11న మావోయిస్టులు ‘జన్‌ అదాలత్‌’ నిర్వహించి సంతోష్‌ను ఏం చేయాలనే విషయాన్ని డిసైడ్‌ చేసేవారు. కానీ సునీత సమాయానికి తన భర్తను కనుగొని.. మావోయిస్టులను వేడుకోవడంతో వారు సంతోష్‌ను విడుదల చేశారు. కానీ అతడు ఇక మీదట పోలీసుగా విధులు నిర్వహించకూడదని మావోలు హెచ్చరించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. ‘తన భర్త క్షేమం కోసం ఓ మహిళ కష్టాలు లెక్కచేయకుండా.. ఎంత దూరమైన వెళ్తుంది. నేను కూడా అదే చేశాను’ అని చెప్పుకొచ్చారు. 
చదవండి: సొంత గూటికి చేరేలోపే..

మరిన్ని వార్తలు