మోదీజీ మీ హయాంలో రుణాల సంగతేంటి..?

2 Sep, 2018 13:38 IST|Sakshi
కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : యూపీఏ హయాంలో ఇచ్చిన రుణాలపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలను మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పీ చిదంబరం తోసిపుచ్చారు. తామిచ్చిన రుణాల్లో ఎంతమేర నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ)గా మారాయో వెల్లడించాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆదివారం డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన రుణాలను ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు రీకాల్‌ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.

2014 మే తర్వాత జారీ చేసిన రుణాల్లో ఎంత మొత్తం నిరర్ధక ఆస్తులుగా మారాయో చెప్పాలని ఎన్డీఏ సర్కార్‌ను నిలదీశారు.పార్లమెంట్‌లో ఎన్నిసార్లు ఈ ప్రశ్నను లేవనెత్తినా సమాధానం లేదని చిదంబరం వరుస ట్వీట్లలో మండిపడ్డారు.

కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ హయాంలో ఇచ్చిన రుణాలు ఎన్‌పీఏలుగా మారాయని శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. 2014కు ముందు 12 మంది బడా ఎగవేతదారులకు ఇచ్చిన రూ 1.75 లక్షల కోట్ల బకాయిదారులపై తీవ్ర చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. మరో 27 భారీ రుణ ఖాతాల నుంచి రూ లక్ష కోట్లు రికవరీ చేసే చర్యలు చేపట్టామని చెప్పారు.

మరిన్ని వార్తలు