ఫుల్‌కోర్ట్‌ సమావేశం ఏర్పాటు చేయండి

26 Apr, 2018 03:12 IST|Sakshi

సీజేఐకి ఇద్దరు సీనియర్‌ జడ్జిల లేఖ

న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయవ్యవస్థను అప్రతిష్టపాలు చేస్తున్న వ్యవస్థాగత లోపాలపై చర్చించేందుకు ఫుల్‌కోర్ట్‌ (సుప్రీంకోర్టులోని అందరు న్యాయమూర్తులతో) సమావేశం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ మదన్‌.బి.లోకూర్‌ సీజేఐ దీపక్‌ మిశ్రాకు లేఖ రాశారు. సీజేఐకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఇచ్చిన అభిశంసన తీర్మానం నోటీసును రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు తిరస్కరించడానికి ముందు రోజు అంటే ఈ నెల 22న ఈ లేఖ రాశారు. రెండే రెండు వాక్యాలు మాత్రమే ఉన్న ఈ లేఖపై గొగోయ్, లోకూర్‌ సంతకాలు చేశారు.

మార్చి 21న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్, ఏప్రిల్‌ 9న మరో న్యాయమూర్తి జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ కూడా న్యాయ వ్యవస్థలోని లోపాలపై ఫుల్‌ కోర్టు ఏర్పాటు చేయాలని కోరడం గమనార్హం. సోమవారం ఉదయం టీ మీటింగ్‌కు న్యాయమూర్తులంతా హాజరైన సమయంలో ఈ లేఖ అంశం చర్చకు వచ్చినట్టు తెలిసింది. అయితే అప్పటికే అభిశంసన తీర్మానాన్ని రాజ్యసభ చైర్మన్‌ తిరస్కరించినట్టు ప్రకటించారు. దీంతో ఈ సమావేశానికి సంబంధించిన విషయాలను గురించి సీజేఐ ఎక్కడా మాట్లాడలేదని తెలిసింది.

>
మరిన్ని వార్తలు