నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం!

19 Jun, 2016 19:46 IST|Sakshi

జైపూర్‌: గత ఎనిమిది రోజుల్లో జైపూర్‌లో జరిగిన రెండు అత్యాచార ఘటనలు కలకలం సృష్టించాయి. మూడన్నర ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైన ఘటన మరవకముందే మరో చిన్నారి కీచకుడి చేతిలో అత్యాచారానికి గురైంది. ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. వికలాంగురాలైన తల్లితో పాటు మూడేళ్ల బాలిక సవాయ్‌ మాన్‌సింగ్‌ ఆస్పత్రి ప్రాంగణంలో నిద్రపోతోంది. ఆ సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఆకస్మాత్తుగా వచ్చి నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు.

మరుసటి రోజు ఉదయం తీవ్ర రక్తస్రావంతో ఆ బాలిక ఏడ్చుకుంటూ కనిపించడంతో వెంటనే అక్కడి స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ఆస్పత్రి ప్రాంగణంలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. జూన్‌ 11న అదే ప్రాంతంలోని ట్రాన్స్‌పోర్టు నగర్‌లో మూడున్నర ఏళ్ల బాలిక అత్యాచారం కేసులో జూన్‌ 15న ఆటో రిక్షా డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు