మృత్యుంజయురాలు ఈ పసిపాప!

20 Nov, 2018 19:57 IST|Sakshi

లక్నో : ఏదైనా పెద్ద ప్రమాదం నుంచి బయటపడినపుడు పొద్దున లేచిన ఘడియ మంచిదయింది లేకపోతే ఏం అనర్థం జరిగేదోనని అనుకోవడం చాలా మందికి అలవాటు. యూపీకి చెందిన ఓ చిన్నారి తల్లిదండ్రులు కూడా అలాగే అనుకోవాలేమో. ఎందుకంటే వారి గారాల పట్టి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.

ఇంతకీ ఏం జరిగిందంటే..  ఉత్తరప్రదేశ్‌లోని మథుర రైల్వే స్టేషన్‌లో ఓ జంట తమ ఏడాది చిన్నారితో వేచి ఉన్నారు. రైలు వస్తుందన్న ప్రకటనతో ప్లాట్‌ఫాంపైకి పరుగెత్తుకు వచ్చారు. ఈ క్రమంలో తల్లి చేతిలో ఉన్న పాప పట్టాల పక్కనే ఉన్న సంధులో పడిపోయింది. ఈలోగానే వేగంగా దూసుకొచ్చిన రైలు ఆమెను దాటుకుని వెళ్లిపోయింది. దీంతో చేసేదేంలేక పాప తల్లిదండ్రులు, ఇతర ప్రయాణికులు అలాగే చూస్తుండిపోయారు. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఆ చిన్నారికి ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. పాపను ఆ దేవుడే రక్షించాడంటూ భక్తి గీతాలు ఆలపించారు.

మరిన్ని వార్తలు