న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై సచివాలయంలోనే ఓ వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం కారంపొడి చల్లాడు. అత్యంత భద్రత ఉండే సచివాలయంలోని సీఎం కార్యాలయం బయటే ఈ దాడి జరిగింది. నిందితుణ్ని ఢిల్లీకి చెందిన అనిల్ కుమార్ శర్మగా గుర్తించిన పోలీసులు, అతణ్ని అదుపులోకి తీసుకున్నారు.
ఖైనీ పొట్లాల్లో కారంపొడి నింపుకుని వచ్చిన అనిల్, మధ్యాహ్నం భోజనానికి సీఎం తన కార్యాలయం నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ దాడి చేశాడు. కేజ్రీవాల్ కంట్లో కారం చల్లేందుకు అనిల్ ప్రయత్నించాడనీ, ఆయన కళ్లద్దాలు కిందపడి దెబ్బతిన్నాయని అక్కడ ఉన్న అధికారులు చెప్పారు.