టిక్‌టాక్‌ నిషేధంతో భారీగా నష్టపోయిన చైనా

2 Jul, 2020 14:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశ సమగ్రతకు, భద్రతకు ముప్పు వాటిల్లుతోందనే కారణంతో 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు చైనా కంపెనీలు తీవ్రమైన నష్టాన్ని చవి చూస్తున్నాయి.  చైనా వార్తా సంస్థ గ్లోబల్‌ టైమ్స్‌ నివేదిక ప్రకారం టిక్‌టాక్, విగో వీడియో, హలో వంటి చైనా యాప్‌లను నిషేధిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన వాటి  మాతృ సంస్థ ‘బైట్‌డాన్స్‌’కు ఘోరమైన దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఆ సంస్థ దాదాపు 6 బిలియన్‌ డాలర్ల వరకు నష్టపోయినట్లు ‘గ్లోబల్‌ టైమ్స్‌’ నివేదిక తెలిపింది. గత కొన్ని సంవత్సరాల్లో, బైట్‌ డాన్స్‌ కంపెనీ దాదాపు 1 బిలియన్ డాలర్లకు పైగా భారత మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిందని గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది. (‘యాప్‌ల బ్యాన్‌ అభినందనీయం’)

మొబైల్ యాప్స్‌ విశ్లేషణ సంస్థ ‘సెన్సార్ టవర్’ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, టిక్‌టాక్‌ను భారతదేశంలో మే నెలలో 112 మిలియన్ సార్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని గ్లోబల్ టైమ్స్ తన నివేదికలో తెలిపింది. ఇది భారత మార్కెట్లో 20 శాతం అని పేర్కొంది. ఈ సంఖ్య అమెరికాలో డౌన్‌లోడ్‌ చేసుకున్న దాని కంటే  రెట్టింపు అని గ్లోబల్ టైమ్స్ తన నివేదికలో పేర్కొంది. 

భారతదేశంలో 59 యాప్‌లను నిషేధించాలని భారత ప్రభుత్వం జూన్ 29 న ఆదేశాలు జారీ చేసింది. భారతదేశం వెలుపల ఉన్న సర్వర్లకు వినియోగదారుల డేటాను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్న కొన్ని మొబైల్ యాప్స్‌ ద్వారా అందిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆ యాప్స్‌ పై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. (టిక్‌టాక్‌కు మ‌రో ఎదురుదెబ్బ‌.)

>
మరిన్ని వార్తలు