ఇండో–పాక్‌–చైనా మైత్రి!

19 Jun, 2018 03:51 IST|Sakshi

చైనా ప్రతిపాదనను  వ్యతిరేకించిన కేంద్రం 

న్యూఢిల్లీ: భారత్, చైనా, పాకిస్తాన్‌ల మధ్య త్రైపాక్షిక సహకారం ఉంటే భారత్, పాక్‌ల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవడం భవిష్యత్తులో సులభమవుతుందని చైనా రాయబారి లువో ఝహూయ్‌ వ్యాఖ్యానించారు. ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ అక్కడి వుహన్‌ నగరంలో అనధికారికంగా భేటీ అవ్వడం తెలిసిందే. ఈ భేటీ అనంతరం భారత్‌–చైనాల బంధం ఇంకెంత దూరం వెళ్లగలదు అనే అంశంపై ఢిల్లీలో చైనా రాయబార కార్యాలయం ఓ సమావేశం ఏర్పాటు చేసింది.

అక్కడ రాయబారి లువో మాట్లాడుతూ ‘షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) మూడు స్తంభాల్లో భద్రతా సహకారం కూడా ఒకటి. ఎస్‌సీవో కింద చైనా, భారత్, పాక్‌ల మధ్య త్రైపాక్షిక సహకారం ఉంటే బాగుంటుందని కొందరు భారతీయ స్నేహితులే నాతో అన్నారు’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ ఖండించింది. భారత్, పాక్‌ల సంబంధాలు పూర్తిగా ద్వైపాక్షికమేననీ, మూడో దేశం ఈ అంశంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. చైనా రాయబారి వ్యాఖ్యలను కాంగ్రెస్‌ కూడా ఖండించింది. భారత్, పాక్‌ల బంధం విషయంలో మరెవ్వరి జోక్యం ఉండకూడదంది.

మరిన్ని వార్తలు