వేలూరు : ఫేస్బుక్ ద్వారా పరిచయమైన అమెరికా యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు చిత్తూరుకు చెందిన యువకుడు. వివరాలు.. ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు జిల్లా గిరింపేటకు చెం దిన శ్రీనివాసన్, గాయత్రి దంపతుల కుమారుడు జయ బాలాజీ(28) వేలూరు వీఐటీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం చెన్నైలోని ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ సమయంలో ఫేస్బుక్ ద్వారా అమెరికాలోని సార అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఫేస్బుక్లోనే ప్రేమించుకున్నారు. సారకు ఇండియా సంప్రదాయం బాగా నచ్చేది. అమెరికాలోని ఇండియన్ హోటల్లోకి తరచూ వెళ్లి భోజనం చేసేది. ఇండియాకు చెందిన యువకుడిని వివాహం చేసుకోవాలనుకుంది. జయబాలాజీతో ప్రేమ వ్యవహారం ఏర్పడడంతో ఇద్దరూ కలిసి వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు.
దీంతో గత ఫిబ్రవరిలో జయబాలాజీ అమెరికాకు వెళ్లి సారను నేరుగా వెళ్లి సంప్రదించాడు. అనంతరం వివాహ ఏర్పాట్లను వేగవంతం చేశారు. దీంతో శుక్రవారం ఉదయం చిత్తూరులోని ఒక ప్రయివేటు హోటల్లో కుటుంబసభ్యులతో కలిసి హిందూ సంప్రదాయంతో వివాహం చేసుకున్నారు. కొత్త జంట శుక్రవారం సాయంత్రం వేలూరు కొత్త బస్టాండ్ సమీపంలోని ప్రయివేటు హోటల్కు వచ్చారు. వారితో పాటు ఇరువురి తల్లిదండ్రులు వచ్చారు. గమనించిన హోటల్ యజమాని ఇళంగోవన్ వెంటనే కేక్ ఆర్డర్ చేసి హోటల్లోనే కేక్ కట్ చేయించి సిబ్బందికి పంచి పెట్టారు. వీటిని గమనించిన హోటల్కు వచ్చిన వారందరూ ఆసక్తిగా చూసి కొత్త పెళ్లిజంటను ఆశీర్వదించారు.