'రాజీవ్‌ హత్య జరగొచ్చు .. పీవీ రావొచ్చు'!

30 Jan, 2017 08:40 IST|Sakshi
రాజీవ్‌ హత్యపై ఐదేళ్ల ముందే చెప్పిన సీఐఏ
న్యూయార్క్‌: భారత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య గురించి అమెరికా నిఘా సంస్థ సీఐఏ ముందే హెచ్చరించిందా? ఆయనపై దాడి జరిగే సూచనలు ఉన్నాయని హత్య జరగడానికి ఐదేళ్ల ముందే ఊహించిందా? అంటే అవునని ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన కొన్ని నిజాలు చెబుతున్నాయి. రాజీవ్‌ గాంధీ 1991లో హత్యకు గురయ్యారు. అయితే, అంతకంటె ముందే రాజీవ్‌ హత్యకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ 1986లోనే ఓ 23 పేజీల్లో 'ఇండియా ఆఫ్టర్‌ రాజీవ్‌..' అనే పేరుతో సీఐఏ రాసింది.

ఈ విషయాన్ని స్వయంగా సీఐఏనే ఇటీవల బయటపెట్టింది. 1986వరకు సీఐఏకు అందిన సమాచారం మేరకు అది రాసిన నివేదికలో తొలి వాక్యంగా 'ప్రధాని రాజీవ్‌ గాంధీ ఆయన పదవికాలం ముగిసేనాటికి హత్యకు గురయ్యే అవకాశం ఉంది. ఆయనకు అత్యంత సమీపంగా ఉన్న అతిపెద్ద ముప్పు హత్యాప్రయత్నమే' అని మరో వాక్యంలో రాసింది. ఇలా సీఐఏ చెప్పిన సరిగ్గా ఐదేళ్ల తర్వాత 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో హత్యకు గురయ్యారు.

రాజీవ్‌ హత్యకు గురయితే కచ్చితంగా భారత్‌కు అమెరికా, రష్యాలతో ఉన్న సంబంధాలపై ప్రభావం పడుతుందని కూడా సీఐఏ అప్పట్లోనే అంచనా వేసింది. పలు గ్రూపులు రాజీవ్‌ హత్యకోసం యత్నిస్తున్నాయని, అది ఏ సమయంలోనైనా జరగొచ్చే అవకాశం ఉందని సీఐఏ రిపోర్టు తెలిపింది. అంతేకాదు, రాజీవ్‌ లేకుంటే ఆ సమయంలో పీవీ నరసింహరావు, వీపీ సింగ్‌లాంటి ప్రజ్ఞావంతులు ప్రధాని అభ్యర్థులుగా వచ్చే అవకాశం ఉందని తెలిపింది. 1991లో పీవీ నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే.  
మరిన్ని వార్తలు