లక్షల్లో కట్నం.. తిరస్కరించిన పెళ్లికొడుకు

15 Nov, 2019 13:47 IST|Sakshi

జైపూర్‌ : వధువు కుటుంబసభ్యులు లక్షల్లో కట్నం ఇస్తామని చెప్పినా వరుడు అందుకు ఒప్పుకోకుండా కేవలం రూ. 11 కట్నం తీసుకొని అందరికి ఆదర్శంగా నిలిచాడు. అతనే రాజస్తాన్‌కు చెందిన జితేంద్ర సింగ్‌ కుమార్‌. వివరాల్లోకి వెళితే.. జితేంద్ర సింగ్‌ కుమార్‌ సీఐఎస్‌ఎఫ్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 8న జితేంద్ర సింగ్‌ వివాహం జైపూర్‌లో ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో వధువు తండ్రి కట్నం కింద రూ. 11 లక్షలు ఒక పళ్లెంలో తీసుకొని వచ్చాడు. దానిని జితేంద్ర సింగ్‌కు ఇవ్వబోతుంటే అతను అడ్డు చెప్పి తన రెండు చేతులు జోడించి కట్నం వద్దని తెలిపారు. సంప్రదాయ ప్రకారం రూ. 11తో పాటు ఒక కొబ్బరిబొండంను వదువు తల్లిదండ్రుల నుంచి స్వీకరించారు.

'నాకు అర్ధాంగిగా రానున్న వ్యక్తి రాజస్తాన్‌ జ్యుడీషిల్‌ సర్వీస్‌కు ప్రిపేర్‌ అవుతున్నారు. ఒకవేళ ఆమె పరీక్షలో పాసయి జిల్లా కలెక్టర్‌గా ఎంపికైతే మా కుటుంబానికి అంతకు మించిన ఆనందం ఏముంటుంది. నాకు డబ్బు ముఖ్యం కాదని, కుటుంబ సంతోషమే గౌరవమని' జితేంద్ర సింగ్‌ పేర్కొన్నారు. ఈ మాటలకు వధువు తండ్రి ముఖం కన్నీళ్లతో నిండిపోవడం అక్కడున్నవారిని భావోద్వేగానికి గురి చేసింది. ' మొదట్లో అతను డబ్బు వద్దన్నప్పుడు నేను కంగారు పడ్డాను.వరుని కుటుంబసభ్యులు పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు సరిగా లేవని అనుకున్నారేమోనని భావించా. కానీ వారి కుటుంబం వరకట్నానికి వ్యతిరేకత అని తెలుసుకొని చాలా సంతోషించా' అని వధువు తండ్రి ఆనందంగా పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు