అయోధ్య కేసు : సీజేఐ విదేశీ పర్యటన రద్దు

17 Oct, 2019 12:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య వివాదంలో తుది తీర్పును వెల్లడించడం అనంతరం ఎదురయ్యే సంక్లిష్టతలు, భిన్నాభిప్రాయాలపై చర్చించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ ఈనెలలో తలపెట్టిన తన విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈనెల 18న ఆయన దుబాయ్‌లో పర్యటించి అటుపై కైరో, బ్రెజిల్‌, న్యూయార్క్‌లో కొన్ని కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉంది. ఈనెల 31న జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ భారత్‌ తిరిగిరావాల్సి ఉంది. కాగా అయోధ్య కేసును పూర్తిగా పరిష్కరించే ప్రక్రియలో భాగంగా ఆయన తన విదేశీ పర్యటనను రద్దుచేసుకున్నట్టు సమాచారం.

అయోధ్య-రామజన్మభూమి వివాద కేసును విచారిస్తున్న ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి జస్టిస్‌ గగోయ్‌ నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. 40 రోజుల పాటు సాగిన వాదనల అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. కాగా ప్రధాన న్యాయమూర్తి నవంబర్‌ 17న పదవీవిరమణ చేయనున్న నేపథ్యంలో నవంబర్‌ 4 నుంచి 15 మధ్య సర్వోన్నత న్యాయస్ధానం ఈ వివాదంపై తీర్పును వెల్లడించవచ్చని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు