చదివింది ఎనిమిదే.. కానీ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌!

24 Jan, 2020 15:53 IST|Sakshi

భోపాల్‌: ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదివి ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడో వ్యక్తి. అంతే కాదు నెలకు అక్షరాలా రూ. 4 వేల జీతం కూడా పొందుతున్నాడు. కానీ ఆ వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాదు. మరి ఎలా టీచర్‌ ఉద్యోగం చేస్తున్నాడనుకుంటున్నారా..! వివరాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్‌ ఖర్గోనే జిల్లాలోని దేవ్లీ ఏరియాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో రామేశ్వర్‌ రావత్‌, జబ్బర్‌ సింగ్‌ అనే ఇద్దరు ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు. (కలెక్టర్‌ని జుట్టుపట్టి లాగాడు.. చెంప పగలగొట్టింది)

వీరు గత కొద్ది రోజులగా విధులకు హాజరు కావడం లేదు. దీంతో పాఠశాలలో ఉన్న 23 మంది పిల్లలకు పాఠాలు చెప్పేందుకు 8వ తరగతి వరకు చదువుకుని ఖాళీగా ఉన్న దయాల్‌ సింగ్‌ అనే వ్యక్తిని టీచర్‌గా నియమించుకున్నారు. నెలకు రూ. 4 వేలు జీతం కూడా ఇస్తున్నారు. పదిహేను రోజులకో సారి వచ్చి ఆ ఇద్దరు టీచర్లు అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకాలు చేసి పోతున్నారు. అయితే ఆకస్మాత్తుగా ఆ పాఠశాలను జిల్లా డిప్యూటీ కలెక్టర్‌ రాహుల్‌ చౌహన్‌ గురువారం సందర్శించారు.

సమయానికి ఆ ఇద్దరు ఉపాధ్యాయులు పాఠశాలలో లేకపోవడంతో అసలు విషయం వెలుగు చూసింది. దయాల్‌ సింగ్‌పై డిప్యూటీ కలెక్టర్‌ ప్రశ్నల వర్షం కురిపించగా అతడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. దీంతో పరిస్థితి అర్థం చేసుకున్న డిప్యూటీ కలెక్టర్‌ రామేశ్వర్‌ రావత్‌, జబ్బర్‌ సింగ్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతేగాక ఆ ఇద్దరి ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. (పాఠశాల పిల్లగాడా.. పశులుగాసే పోరగాడా..)

మరిన్ని వార్తలు