నేను చచ్చిపోయాను.. సెలవు కావాలి!

1 Sep, 2019 14:42 IST|Sakshi

సాక్షి, లక్నో : సెలవు పెట్టడానికి ఓ ఎనిమిదవ తరగతి విద్యార్థి రాసిన కారణం తెలిస్తే మన కళ్లు పెద్దవికాక మానవు. తన చావును కారణంగా చూపి సెలవు తీసుకోవటం, దానికి స్కూలు ప్రిన్సిపల్‌ ఆమోదం తెలపడంతో ఈ ఘటన వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కాన్పూర్‌కు చెందిన ఓ ఎనిమిద తరగతి విద్యార్థి సెలవు కోసం చీటీ రాసి ప్రిన్సిపల్‌ను సంప్రదించాడు. ఆ సెలవు చీటీలో ‘‘ అయ్యా! నేను ఈ రోజు ఉదయం(ఆగస్టు 20, 2019) 10గంటలకు చనిపోయాను. కావునా, నేను తొందరగా ఇంటికి వెళ్లాలి. ఇందుకోసం అర్థరోజు సెలవు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.’’ అని రాశాడు. విద్యార్థి అందులో ఏం రాశాడో చదవకుండానే ప్రిన్సిపల్‌ సంతకం చేసి పంపించేశాడు.

ఓ పిచ్చి కారణానికి సెలవు దొరకటంతో సదరు విద్యార్థి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే కొద్దిరోజులు ఈ విషయం గురించి మాట్లాడకుండా ఉన్న విద్యార్థి! ఆ తర్వాత తన మిత్రులతో సెలవు చీటీ సంగతులు పంచుకున్నాడు. దీంతో ఆనతికాలంలో పాఠశాల మొత్తం ఈ విషయం పాకిపోయింది. అతడు రాసిన సెలవు చీటీ సోషల్‌ మీడియాలో సైతం వైరలై విషయం పాఠశాల యాజమాన్యానికి తెలిసింది. అయితే దీనిపై స్కూలు యాజమాన్యం స్పందించలేదు. కానీ, తమ స్కూలు ప్రిన్సిపల్‌కు సెలవు చీటీల్లో ఏముందో పూర్తిగా చదివే అలవాటు లేదని కొందరు ఉపాధ్యాయులు అతడ్ని వెనకేసుకు రావటం గమనార్హం.

మరిన్ని వార్తలు