డివైడర్ను దాటి క్యాంటర్, ఆటోను ఢీ
డ్రైవర్ సహా ముగ్గురికి గాయాలు
సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కాన్వాయ్లో ఒక వాహనం బోల్తా పడగా డ్రైవర్ గాయపడ్డాడు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో సీఎం యడి యూరప్ప, ఆయన కార్యదర్శి సెల్వకుమార్ తుమకూరు బయలుదేరారు. సీఎం యడియూరప్పతో పాటు సెల్వకుమార్ ఒకే కారులో కూర్చున్నారు. సెల్వకుమార్కు చెందిన ఇన్నోవా కారు వారి వెనుక ఖాళీగా వస్తోంది. యశవంతపుర ఉపరితల వంతెనపై అతివేగంతో వచ్చి అదుపు తప్పి డివైడర్ను ఢీకొని అవతలి వైపు రోడ్డులో వెళ్తున్న క్యాంటర్, ఆటోను ఢీకొంది. ప్రమాదంలో ఇన్నోవా డ్రైవర్ వినయ్తో పాటు ఇతర వాహనాల్లో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇన్నోవా ముందుభాగం నుజ్జునుజ్జయింది. ఎయిర్బ్యాగు తెరచుకోవడంతో డ్రైవర్ గాయాలతో బయటపడ్డాడు. అయితే అతి వేగం కారణంగానే వాహనం అదుపు తప్పి బోల్తా పడిందని పోలీసులు తెలిపారు. సీఎం యథావిధిగా తుమకూరు వెళ్లిపోయారు. ప్రమాదంతో అరగంట పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఫ్లై ఓవర్పై స్తంభించిన ట్రాఫిక్