నువ్వూ బూట్లు నాకావా?

28 Dec, 2017 11:42 IST|Sakshi

సీఎం సిద్ధు విసుర్లు 

సాక్షి, బళ్లారి: రాజకీయాలల్లో విమర్శలు చేయడం సర్వసాధారణం. అయితే వాడే పదజాలాలు ఇతరులను నొప్పించకుండా ఉండాలి. నోరు ఉందని ఏది పడితే అది మాట్లాడితే సంస్కృతి అనిపించుకోదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. సాధనా పర్వలో భాగంగా ఆయన చిత్రదుర్గ జిల్లాలో హొళల్కెరె తాలూకాలో విలేకరులతో మాట్లాడారు. తాను అధికారం కోసం బూట్లు నాకుతానని ఎవరో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అయితే అదే వ్యక్తి అధికారం కోసం పదవులు అనుభవించేందుకు బూట్లు నాకాడా? అని బీజేపీ నేతలపై మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో నిర్మించాల్సిన కనక భవనాన్ని తాలూకా కేంద్రంలో ఎందుకు నిర్మించాల్సి వచ్చిందని మంత్రి ఆంజనేయపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 

హెగ్డే వల్ల బీజేపీకి నష్టం 
కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌ హెగ్డే నీచ పదజాలాలు ఉపయోగిస్తుండడం ఆయన హోదాకు తగదన్నారు. బ్రాహ్మణ కులంలో మంచి జ్ఞానం కలిగిన వారు ఉన్నారని, ముఖ్యమంత్రి గుండూరావు ఎంతో సంస్కృతితో వ్యవహరించారని గుర్తు చేశారు. అనంత్‌కుమార్‌ హెగ్డే మాట తీరు వల్ల బీజేపీకి ఓట్లు వస్తాయనే భ్రమల్లో ఉన్నారని, కానీ.. ఆ పార్టీకి రోజు రోజుకి ప్రజాదరణ తగ్గిపోతోందన్నారు. హిందూ ధర్మంలో కూడా ఎక్కడా పరధర్మంపై విమర్శలు చేయమని చెప్పలేదన్నారు. ఒక సమాజం ఎక్కువ, మరొక సమాజం తక్కువ చేసి మాట్లాడడం మానుకోమన్నారు. 

మరిన్ని వార్తలు