దూబే ఎన్‌కౌంటర్‌పై విచారణ కమిటీ

15 Jul, 2020 04:35 IST|Sakshi

అవకాశాలను పరిశీలిస్తామన్న సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే, అతని అనుచరుల ఎన్‌కౌంటర్లతో పాటు 8 మంది పోలీసుల హత్యపై విచారణ జరిపించడానికి కమిటీ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో  కమిటీని ఏర్పాటు చేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చునని వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే ఆధ్వర్యంలో సుప్రీం బెంచ్‌ ఎదుట మంగళవారం యూపీ ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది జూలై 16లోగా స్టేటస్‌ రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పిస్తామని వెల్లడించారు.

దీనిపై స్పందించిన సుప్రీం బెంచ్‌.. తెలంగాణలో వెటర్నరీ వైద్యురాలి గ్యాంగ్‌రేప్‌ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసుపై సుప్రీం మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్టుగానే ఈ కేసులో కూడా కమిటీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించే అవకాశాలున్నాయని పేర్కొంది. కాగా, ఎన్‌కౌంటర్‌లో హతమైన వికాస్‌ దూబే నెల సంపాదన రూ.కోటి వరకు ఉంటుందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు వెల్లడించినట్టుగా కథనాలు వెలువడ్డాయి. ‘దూబే సాదాసీదా జీవితాన్నే గడిపేవాడు. అతని బ్యాంకు అకౌంట్లలో పెద్ద మొత్తంలో సొమ్ము లేదు. మరి ఆ డబ్బంతా ఏం చేశాడో విచారిస్తున్నాం’అని ఈడీ అధికారి ఒకరు వెల్లడించారు.  

మరిన్ని వార్తలు