డిగ్గీ రాజా గెలుపు కోసం కంప్యూటర్‌ బాబా పూజలు

7 May, 2019 14:12 IST|Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సీఎంగా ఉన్న సమయంలో మంత్రి హోదాను అనుభవించిన కంప్యూటర్‌ బాబా తాజాగా భోపాల్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి దిగ్విజయ్‌ సింగ్‌ గెలుపుకోసం హఠ యోగా నిర్వహించారు. వందలాది సన్యాసులతో భోపాల్‌లోని సైఫియా కాలేజ్‌ మైదానంలో ఆయన ఈ పూజలు జరిపారు. బీజేపీ ప్రభుత్వం ఐదేళ్లలో రామ మందిరం నిర్మించలేదని, మందిర్‌ లేకుండా నరేంద్ర మోదీ కూడా ఉండటానికి వీల్లేదని కంప్యూటర్‌ బాబా మండిపడ్డారు.

బీజేపీకి చెందిన సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌పై దిగ్విజయ్‌ సింగ్‌ విజయాన్ని కాంక్షిస్తూ మూడు రోజుల పాటు ఏడు వేల మంది వరకూ సాధువులు పూజలు చేయనున్నారు. దిగ్విజయ్‌ సింగ్‌కు ఓటు వేయాలని కోరుతూ వందల మంది సన్యాసులు భోపాల్‌లో ఆటపాటలతో ప్రజలను కోరతారని కంప్యూటర్‌ బాబాగా పేరొందిన నామ్‌దేవ్‌ దాస్‌ త్యాగి చెప్పారు. కాషాయ వస్ర్తాలను ధరించినందుకే ప్రజ్ఞా సింగ్‌ను సాధ్విగా పిలవడం తగదని అన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలతో ఆమెకు సంబంధం ఉందని, ఆమె హత్య కేసులోనూ నిందితురాలని కంప్యూటర్‌ బాబా ఆరోపించారు.

>
మరిన్ని వార్తలు