బిహార్‌లో వలస కూలీలకు కండోమ్‌ల పంపిణీ

2 Jun, 2020 16:34 IST|Sakshi

పట్నా: సొంత రాష్ట్రం చేరుకున్న వలస కూలీలకు బిహార్‌ ప్రభుత్వం ఉచితంగా కండోమ్‌లను పంపిణీ చేస్తోంది. బిహార్‌కు చెందిన 30 లక్షల మంది వలస కార్మికులు వివిధ దశల్లో రాష్ట్రానికి చేరుకున్నారు. వారిలో కొందరు ఇప్పటికే 14 రోజుల క్వారంటైన్‌ ముగిసి ఇళ్లకు చేరగా.. మరికొంతమంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఈక్రమంలో అవాంఛిత గర్భధారణను నిరోధించేందుకు రాష్ట్ర కుటుంబ ఆరోగ్య శాఖ కండోమ్‌ల పంపిణీ నిర్ణయం తీసుకుంది. క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్నవారికి, ఇళ్లకు చేరుకున్న వలస కూలీలకు కండోమ్‌లు పంపిణీ చేస్తున్నామని బిహార్‌ ఆరోగ్యశాఖకు చెందిన డాక్టర్‌ ఉత్పల్‌ దాస్‌ వెల్లడించారు. కేర్‌ ఇండియా సంస్థ సహకారంతో ఈ డ్రైవ్‌ చేపట్టామని తెలిపారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 8.77 లక్షల మంది క్వారంటైన్‌ ముగించుకుని ఇళ్లకు వెళ్లారని, మరో 13 లక్షల మంది క్వారైంటైన్‌ సెంటర్లలో ఉన్నారని చెప్పారు. బ్లాక్‌లు, జిల్లా కేంద్రాల్లో ఇంకా 5.30 లక్షల మంది క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు. అవాంఛిత గర్భధారణ విషయంలో ఇంటికి వెళ్లే ముందు వలస కూలీలకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇది పూర్తిగా కుటుంబ నియంత్రణ కోసం చేపట్టిన కార్యక్రమం అని కోవిడ్‌-19తో ఎటువంటి సంబంధం లేదని ఉత్పల్‌ దాస్‌ స్పష్టం చేశారు. ఆరోగ్యశాఖ అధికారిగా జనాభాను అదుపులో ఉంచడం తమ బాధ్యత అన్నారు. కాగా, బిహార్‌లో ఈ నెల 15తో క్వారంటైన్‌ సెంటర్ల సేవలు ముగియనున్నాయి. బిహార్‌ జనాభా 11.5 కోట్లు కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు