‘అమిత్‌ షాకు అందుకే స్వైన్‌ఫ్లూ సోకింది’

17 Jan, 2019 17:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా ఆరోగ్య పరిస్థితిపై సీనియర్‌ కాంగ్రెస్‌ నేత బీకే హరిప్రసాద్‌ గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్న అమిత్‌ షా ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచినందుకే అమిత్‌ షాకు స్వైన్‌ఫ్లూ సోకిందని వ్యాఖ్యానించారు. సంకీర్ణ సర్కార్‌ను కూలదోసే చర్యలు విరమించకపోతే ఆయనకు జ్వరంలో పాటు డయేరియా ఇతర వ్యాధులు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను కిడ్నాప్‌ చేసిన బీజేపీ నేతలు వారిని ముంబై తరలించారని, వారికి బీజుఏపీ, ఆరెస్సెస్‌ కార్యకర్తలను కాపలగా ఉంచారని హరిప్రసాద్‌ ఆరోపించారు. జేడీయూ-కాంగ్రెస్‌ సర్కార్‌ను కూలదోయాలని ప్రయత్నించడంతోనే అమిత్‌ షాకు ఈ వ్యాధి సోకిందని ధ్వజమెత్తారు. మరోవైపు స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్న అమిత్‌ షా కోలుకున్నారని, ఒకట్రెండు రోజుల్లో ఆయనను ఎయిమ్స్‌ నుంచి డిశ్చార్జి చేస్తారని బీజేపీ మీడియా చీఫ్‌, రాజ్యసభ సభ్యుడు అనిల్‌ బలూనీ చెప్పారు. 

మరిన్ని వార్తలు